కొత్తపల్లి గీత.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రభుత్వాధికారిగా.. రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితమే.! తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం ప్రాంతానికి చెందిన గీత ఎంఏ వరకు చదివి గ్రూప్-01 అధికారిగా సేవలందించారు. ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని వదిలేసి 2013లో వైసీపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే 2014లో జరిగిన ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీచేసి 91,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన మరుసటి రోజు నుంచే అరుకును అభివృద్ధి బాటలో నడిపించి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వచ్చిన కొన్ని విబేధాలతో బయటికొచ్చి.. ఎంపీగానే కొనసాగుతూ 2018లో స్వయంగా జనజాగృతి పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన సామాజిక వర్గాన్నే కాదు.. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన వారిని అభివృద్ధి బాటలో నడిపించాలనే తపనతో ముందుకొచ్చారు కానీ.. పార్టీ అంటే డబ్బులతో ముడిపడి ఉంటుందని ఆలస్యంగా తెలుసుకుని 2019లో బీజేపీలో విలీనం చేయడం జరిగింది. నాటి నుంచి బీజేపీ నేతగా కొనసాగుతూ నియోజకవర్గానికి తన వంతుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఆమె కృషికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి కూడా దక్కింది. అంతేకాదు.. అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న గీతను సీటు దక్కేలా చేసింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ కొత్తపల్లి దూసుకెళ్తున్నారు.

గిరిజనాభివృద్ధి అనేది నరేంద్ర మోదీతోనే సాధ్యమని గీత గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు. అరకులో ఇప్పుడున్న పరిస్థితిని పూర్తిగా మార్చడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఎందుకంటే గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదని.. గిరిజనులు అంటే మోదీకి ప్రేమ అని.. దీంతో కచ్చితంగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్క గిరిజన బిడ్డను బాగుచేస్తామని.. అది కూటమి గెలిస్తే.. కేంద్రంలో మోదీ వస్తేనే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అరకు ఎంపీగా గెలిస్తే.. విద్య, వైద్యం, సొంతింటి కల, యువతను బాగు చేయడం ఈ నాలుగే టార్గెట్‌గా ముందుకెళ్తున్నట్లు తెలిపారు గీత. యువత అంటే ఎంతసేపూ జెండాలు పట్టుకోవడానికి తప్ప.. వారికి ఉద్యోగాలు, ఇండస్ట్రీలు తీసుకొచ్చిన పాపాన వైసీపీ పోలేదన్నారు. ఇప్పటికే తాను ఎంపీగా పనిచేసినంతకాలం అభివృద్ధికై సాయశక్తులా కృషి చేశానని.. మరోసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చూపిస్తామంటున్నారు. తనకు ఎలాంటి ఆస్తులు, అంతస్థులు, గెస్ట్ హౌస్‌లు లేవని ప్రజలే తనకు పెద్ద ఆస్తి అని.. ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులు పనిచేయడానికే తాను ముందుంటానని చెబుతున్నారు. దీంతోపాటు ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా చేస్తామని మాటిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌ చేయకుండా ఉండటానికి తనవంతుగా యుద్ధం చేస్తానని.. చట్ట ప్రకారమే చేయడానికి మాత్రమే వీలుకల్పిస్తామని కొత్తపల్లి క్లియర్ కట్‌గా చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మహిళ, గిరిజనులను అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న మనిషి. అరకులోని ప్రజల జీవన విధానం మార్చి.. ఆ ప్రాంతాన్ని అట్రాక్టివ్ టూరిజం ప్రాంతంగానే కాకుండా.. ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. గిరిజనులను లక్షాధికారి చేయడమే లక్ష్యంగా మోదీ ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలున్నాయో అరకులో కూడా అలాంటివే ఏర్పాటు చేసి.. విదేశీ విద్యకు గిరిజనులను పంపి.. ఇవేకాదు సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నారని గీత చెబుతున్నారు. మరీ ముఖ్యంగా.. అరకు ప్రాంతానికి వ్యాపారం పేరిట వచ్చి కొందరు అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయడం.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని భూములు రాయించుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి తన వంతు ప్రయాత్నాలు చేస్తానని కొత్తపల్లి గీత హామీ ఇచ్చారు. వాస్తవానికి తాను దీన్ని రూపుమాపడానికి 2014లో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని.. ఈసారి 2024 ఎంపీగా గెలిస్తే ఎన్నికల ఫలితాలొచ్చిన జూన్-05 నుంచే కచ్చితంగా దీన్ని అణిచివేసే పోరాటం చేస్తానన్నారు. గిరిజన ప్రాంతానికి.. గిరిజన బిడ్డలకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు గీత వెల్లడించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *