Rao Gopal Rao.. విలక్షణ నటుడిగా.. విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ నటుడు రావు గోపాల్ రావు ( Rao Gopal Rao)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ ను మొదలుకొని నెక్స్ట్ జనరేషన్ హీరో చిరంజీవి వరకు ఇలా ఎంతోమంది సినిమాలలో విలన్ క్యారెక్టర్లు పోషించి మరింత పాపులారిటీ దక్కించుకున్న రావు గోపాల్ రావు ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నారు.
సినీ ఇండస్ట్రీకి సరికొత్త విలనిజాన్ని పరిచయం చేసి విలన్ క్యారెక్టర్ కే వన్నె తెచ్చిన విలక్షణ నటుడు.. ముత్యాలముగ్గు చిత్రంలో చేసిన పాత్ర ద్వారా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో తనదైన డైలాగ్ మాడ్యులేషన్ తో ఆకట్టుకున్నారు. 1937 ఆంధ్ర ప్రదేశ్ లోని గంగనపల్లి గ్రామంలో రావు గోపాలరావు జన్మించారు . చిన్నతనం నుండి నాటకాలపై ఆసక్తి ఉన్న ఈయన రంగస్థల నటుడుగా తన కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత సినీ పరిశ్రమలో పెట్టాడు.
మొదట్లో చిన్నచిన్న క్యారెక్టర్ లో నటించిన రావు గోపాలరావు (Rao Gopal Rao) ఆ తర్వాత క్రాంతి కుమార్ “శారదా” చిత్రంలో చేసిన పాత్రతో మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకొని.. ముత్యాలముగ్గు సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు. ఆ తర్వాత కాలంలో రావు గోపాల్ రావు పాత్ర లేకుండా ఏ సినిమా కూడా వచ్చేది కాదు . అంతలా విలన్ పాత్రలకు ఆయనకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు పొందుతూ ఆర్థికంగా బాగా ఎదిగారు.
అయితే ముందు చూపు లేని రావు గోపాల్ రావు కొంతమందిని నమ్మి ఆర్థిక నష్టాన్ని చవిచూశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. చికిత్సకు డబ్బులు లేక 1994 ఆగస్టు 13వ తేదీన మరణించారు. అయితే ఇంత గొప్ప విలన్ గా పేరు ప్రఖ్యాతలు గడించిన ఈయన అంత్యక్రియలకు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు నివాళులు అర్పించడానికి వెళ్లలేదు అంటే ఆయన ఎంత దయనీయ పరిస్థితుల్లో చనిపోయారో అర్థం చేసుకోవచ్చు.
అప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవడంతో రావు గోపాల్ రావు అంత్యక్రియలు చెన్నైలో జరగడం వల్ల సినీ ప్రముఖులు వెళ్లలేకపోయారని సమాచారం. ప్రస్తుతం ఆ గౌరవాన్ని ఆయన వారసుడు రావు రమేష్ పొందుతున్నట్లు తెలుస్తోంది .