నందమూరి తారకరత్న(Taraka Ratna) ఆరోగ్యం మరింత ఇంకా క్రిటికల్ గానే ఉంది. `యువగళం` పాదయాత్రలో నడుస్తూ గుండెపోటుకు గురైన తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజిస్ట్లు, ఇంటెసివిస్ట్లు, ఇతర స్పెషలిస్టులు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలోనే ఉంటూ వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు హెల్త్ బులిటెన్లో వెల్లడించడం అభిమానులు తీవ్ర కలవార పాటుకు గురి చేస్తోంది. మరోవైపు ఆయన హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని తెలియడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరు నారాయణ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. నిన్న తారకరత్నను టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), పురంధేశ్వరి పరామర్శించిన సంగతి తెలిసిందే.
అయితే నేడు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, కళ్యాణ్ రామ్(Kalyan Ram) నారాయణ హృదయాలయ హాస్పటల్ కు చేరుకున్నారు. వారితో పాటు పునీత్ రాజ్ కుమార్ సోదరుడు, ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్, కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ కూడా ఆస్పత్రికి వెళ్లి తారకరత్నను ఐసీయూ లో పరామర్శించారు. ఆస్పత్రిలో తారకరత్న ను చూడగానే జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయారు. వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. అనంతరం మీడియాతో ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
`తారకరత్న పోరాడుతున్నాడు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆత్మబలం, అభిమానుల ఆశీర్వాదం అతడికి ఉంది. ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్న చికిత్సకు సహకరిస్తున్నారు. నేను ఐసీయూలోకి వెళ్లి పలకరించే ప్రయత్నం చేశాను. కొంత స్పందన కనిపించింది. తాతగారి ఆశీస్సులు, దేవుడు దీవెనలు ఆయనకు బలంగా ఉన్నాయి. అభిమానుల ప్రత్యేక పూజలతో తారకరత్న పూర్వస్థితికి వస్తారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం` అంటూ ఎన్టీఆర్(NTR) చెప్పుకొచ్చారు. ఏదేమైనా తారకరత్నకు ఏమవుతుందోనన్న ఆందోళన అందరిలోనూ కొనసాగుతూనే ఉంది.