రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఇటీవల తన ఖుషి సినిమా సక్సెస్ సందర్భంగా వంద మంది అభిమానులకు తలా లక్ష రూపాయలు అందించిన విజయ్…తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన శ్రీకాకుళం చిన్నారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.
కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెందిన మెండ అప్పలనాయుడు కుమార్తె ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న హీరో విజయ్ దేవరకొండ లక్ష రూపాయల చెక్ ను ఆ బాలిక కుటుంబానికి పంపించారు. ఆ చెక్ ను శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం జిల్లా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అధ్యక్షుడు అల్లు తారక్ బాలిక కుటుంబ సభ్యులకు అందజేశారు. తమకు సాయం చేసిన విజయ్ దేవరకొండకు బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.